Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షురాలు ఎస్.కె.ప్రసన్న
నవతెలంగాణ-హిమాయత్నగర్
కాంట్రాక్టు హెల్త్ వర్కర్స్ అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించి, పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈఎస్ఐ(ఐఎంఎస్) ఉమెన్స్ ఎంప్లాయీస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.కె.ప్రసన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకొని, రెగ్యులరైజ్ చేయాలన్నారు. లేని పక్షంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తొలగించిన 660 మందితో నామినేషన్ వేయనున్నట్లు హెచ్చరించారు. సెకండ్ ఏఎన్ఎంలకు, నర్సులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజమణి, మహిళా విభాగం సభ్యులు విజయకుమారి, వాణి, శశికళ, బాలమణి, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.