Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదరికం కారణంగా ఎవరు తమ హక్కులను కోల్పోరాదని, అందుకోసం న్యాయసేవాధికార సంస్థ వారికి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వై రేణుక అన్నారు. పాన్ ఇండియా అవగాహన, విస్తరణలో భాగంగా జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు జంటనగరాలలోని ప్రతి బస్తి, ప్రతి మురికివాడ, అన్ని కూడళ్లలో ప్రజలను కలుసుకుని, న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి, వారికి న్యాయ చైతన్యం కలిగించాలని న్యాయసేవాధికార సంస్థ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పురాణహవేలిలోనీ సిటీ సివిల్ కోర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన, ఆజాదీ కా అమత మహౌత్సవ్, పాన్ ఇండియా న్యాయ విజ్ఞాన విస్తరణ క్యాంపెయిన్ సన్నాహక సమావేశంలో జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వై.రేణుక, చీఫ్ జడ్జి డాక్టర్ సి. సుమలత పాల్గొని ప్రసంగించారు. మధ్యాహ్నం పురాణహవేలీలోని న్యాయ సేవాసదన్లో బార్ అసోసియేషన్ సభ్యులు, పారాలీగల్ వాలంటీర్లు, లా కళాశాల విద్యార్థులు, ఎన్జీవోల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణుక మాట్లాడుతూ అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమాలు నవంబర్ 14 వరకు కొనసాగుతాయని అప్పటివరకు, న్యాయసేవాధికార సంస్థ అందించే న్యాయ సేవలు, విచారణ ఖైదీలకు ఉచిత న్యాయవాది ఏర్పాటు, మొదలగు విషయాలపై, పేదలకు బడుగు వర్గాలవారికి విస్తత ప్రచారం చేయాలని కోరారు. ప్రతి నగరంలో న్యాయ సేవాకార్యకర్తలు టీంలుగా ఏర్పడి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్, చీఫ్జడ్జి డాక్టర్ సి.సుమలత మాట్లాడుతూ ఈ న్యాయవిజ్ఞాన ప్రచార కార్యక్రమాలలో పానల్ లాయర్లు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, లా కళాశాల విద్యార్థులు కీలకపాత్ర వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంనారాయణ మాట్లాడుతూ ఈ మొత్తం క్యాంపెయిన్లో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తమ వంతు పాత్ర నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ మాట్లాడుతూ నల్సా విడుదల చేసిన 42 రోజుల క్యాంపెయిన్ కార్యక్రమ వివరాలను తెలిపారు. రెండో అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర్రావు మాట్లాడుతూ పేదలకు సమాజంలో నిర్లక్ష్యానికి గురి కాపాడే వారికి న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, స్వచ్ఛందన్యాయ సేవకులు, వివిధ లా కళాశాల విద్యార్థులు, ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.