Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాన్ ఇండియా అవేర్నెస్ అండ్ ఔట్ రీచ్ క్యాంపెయిన్లో సిటీ సివిల్కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.మురళీమోహన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదలు, మహిళలు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ కులాల వారు, పారిశ్రామిక కార్మికుల పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు న్యాయసేవాధికార సంస్థ తరపున ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్టు సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.మురళీమోహన్ తెలిపారు. బుధవారం తుకారంగేట్ సెంటరులో సిటీ సివిల్ కోర్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, యాక్షన్ ఎయిడ్ ఎన్జీవో, స్థానిక అడ్డగుట్ట పీహెచ్సీ సహకారంతో నిర్వహించిన మెడికల్ క్యాంప్, లీగల్ ఎయిడ్ క్లినిక్ల సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో కె.మురళీమోహన్ మాట్లాడుతూ తమ దగ్గరలోని న్యాయస్థానం పరిధిలో ఉన్న న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చన్నారు. విచారణ ఖైదీలు, జైలులో మగ్గుతున్న పేదలు, అర్హులందరికీ ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం, కోర్టు ఫీజు నుంచి మినహాయింపునివ్వడం, ఉచిత న్యాయ సహాయం, ఉచిత న్యాయ సలహాలు అందించడం న్యాయ సేవాధీకార సంస్థల బాధ్యత అనీ, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆజాది కా అమత మహౌత్సవం వేడుకల్లో భాగంగా నల్స పిలుపులో భాగంగా పాన్ ఇండియా అవగాహన, విస్తరణ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువగా పనిచేసేందుకు వాడ వాడనా ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తొలుత స్థానిక ప్రజలకు సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ, యాక్షన్ ఎయిడ్ సంస్థలు, స్థానిక అడ్డగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధులు వందన బుదార్, నేహ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత, సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు చిన్న రాజు, దయాకర్, ప్రమోద్, పెండేకంటి లా కళాశాల విద్యార్థులు స్వాతి, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.