Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
వయస్సుపైబడే కొద్ది కీళ్ల అరుగుదల, నడక నరకప్రాయమై చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని వారికి అత్యాధునిక కీళ్ల మార్పిడి సర్జరీ పునర్జన్మనే అని రెనోవా హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.కార్తీక్ తెలగరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే పురస్కరించుకొని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా మోకాళ్లు నొప్పి తగ్గక బాధపడుతున్న వారికి మోకాళ్లు మార్పిడి చికిత్స అవసరం ఉంటుందన్నారు. 10 నిమిషాలు కంటే ఎక్కువ సమయం నిలబడలేకపోవడం, 500 గజాలు కంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం, అందరిలా మెట్లు ఎక్కలేకపోవడం, మోకాళ్ల నొప్పులు ఎలాంటి మందులకు తగ్గకపోవడం వంటివి ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలుగా అభివర్ణించారు. ఇదివరకు ఇచ్చే అనస్థీషియా పద్ధతిలో ఆపరేషన్ తర్వాత నొప్పులు ఎక్కువగా ఉండడం వల్ల రోగి 2 రోజులు తర్వాత గాని నడక మొదలు పెట్టేవారు కాదన్నారు. కానీ కొత్తగా వచ్చిన ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేసినా వారిలో నొప్పి చాలా తక్కువగా ఉండటం, చాలా మంది సర్జరీ చేసిన రోజు సాయంత్రం నుండే నడక ఆరంభించడం రెండు రోజులలోనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారని చెప్పారు. ఇలా మొదటి రోజు నుంచే నడవటం వల్ల వారి ఆత్మ విశ్వాసం పెరిగి చాలా తొందరగా కోలుకోవడం గమనించదగ్గ విషయమన్నారు. రోగి ఆపరేషన్ చేసిన రోజు నుంచే నడవడం ద్వారా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే సమస్య(డీవీటీ) వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని ఆయన వివరించారు.