Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
హమ్మయ్య...! దాదాపు వానాకాలం ముగిసింది. ఇక వచ్చే ఏడాది దాకా ఎటువంటి ఇబ్బందులేనట్లే అని భావిస్తున్నారా? అయితే ఒక్క క్షణం.. ఏ చెడగొట్టు వానో, ఏ గులాబ్ వంటి తుఫానో వచ్చిందే అనుకోండి.. కథ మళ్లీ మొదటికొచ్చినట్లే కదా! అలాంటి సీన్ ఒకటి మీకు తప్పక చెప్పాలి. అదేమిటంటే.. గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక కాలనీలు, ఇండ్లు నీట మునిగాయి. అపారమైన నష్టం వాటిల్లింది. ఇండ్లలోకి నీరు చేరి విలువైన వస్తువులు, నిత్యావసర ధాన్యాలు, బట్టలు, ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు ఇలా అనేకమైన వస్తువులు పాడైపోయాయి. అప్రమత్తమయిన సర్కారు బాధితులకు రూ. పదివేల నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకుంది. అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలు బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరద నీరు ఇండ్లలోకి రాకుండా రూ.110 కోట్ల వ్యయంతో స్ట్రాటేజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు (ఎస్డీపీ) ద్వారా వరద నీరు నేరుగా మూసీలో కలిసేలా డ్రయినేజీ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అత్యవసరంగా డిజైన్ రూపొందించాలని స్థానిక మేయర్లు, కమిషనర్లు, డీఈలకు ఆదేశాలను జారీ చేశారు. ఇక ఈ ఏడాది ఏదో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం ఎలాగో జరిగింది. వచ్చే ఏడు అయినా వరదలు ఇండ్ల మధ్యకు, కాలనీల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని స్వయంగా సంబంధిత శాఖ మంత్రి కేటీఅర్ హమీ ఇవ్వడంతో ప్రజలంతా నిజమే అనుకున్నారు. మంత్రి పర్యటించి ఏడాది గడిచినా ప్రాజెక్ట్ మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు.
అదేస్థాయిలో వరద
వర్షాలు వచ్చిన సమయంలో హడావిడి చేసి.. ఇదిగో పనులు ప్రారంభం అవుతాయి.. అదిగో వచ్చే పాయే అనే మాటలే తప్ప వరద నీరు నేరుగా మూసీలో కలిసేలా చేస్తామని చెప్పిన ఎస్డీపీ ప్రాజెక్టు అడ్రస్లేకుండా పోయింది. ఈ ఏడాది సెప్టెంబర్లో, ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అదే స్థాయిలో కాకపోయినా వరదలు షరా మామూలుగానే రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది భారీ వర్షాలు మరిన్ని కురిస్తే మరోసారి ముంపు ప్రాంతాల ప్రజలు నష్ట పోవాల్సిందేనా? అనే సందేహంలో ఉన్నారు. గతేడాది వచ్చిన వరదల కారణంగా గుణపాఠం నేర్చుకుని అపారమైన నష్టం చవిచూసిన ప్రజలకు ఈ సారైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పాలక వర్గాలకే తెలియాలి.
ఎక్కడి వరకు వచ్చింది?
వరదల సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఅర్ లోతట్టు ప్రాంతాలలో పర్యటించి వచ్చే ఏడాది ఇలాంటి నష్టం రాకుండా చేస్తామని హమీ ఇచ్చారు. దీనికిగానూ రూ.110 కోట్ల బడ్జెట్ తో డ్రయినేజీ సిస్టం ఏర్పాటు త్వరలోనే ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హమీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పనులు తీర్మానాల దశలోనే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.