Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో నాలాల ఆక్రమణ, విస్తరణ, అభివృద్ధి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకు నేందుకు క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ అధికారులకు దీనిపై దిశానిర్దేశం చేశారు. నాలాల ఆక్రమణలు, కబ్జాల విషయంలో స్థానికంగా రాజకీయపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి త్వరలో గ్రేటర్లోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే నాలాలపై కిర్లోస్కర్, వయాంట్స్ కన్సల్టెంట్ ఎజెన్సీలు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశాయి. కానీ వాటిని పట్టించుకున్న పాపానపోలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోసారి సర్వే నిర్వహించాలనే విషయంపై ప్రతిపక్షాలు మండిపడు తున్నాయి.
గ్రేటర్ పరిధిలో దాదాపు 1360 కిలోమీటర్ల మేర నాలాలు ఉన్నాయి. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీలకు చెందిన అధికారులు సభ్యులుగా దాదాపు 35 టీమ్లుగా ఏర్పడి నాలాల సర్వే చేశారు. గ్రేటర్ పరిధిలోని ప్రధానమైన 23 నాలాలలో ఆక్రమణలు, అక్రమ కట్టడాలను గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 102 ప్రధాన నాలాలు, 220కిలోమీటర్ల విస్తీర్ణంలోనూ, ఎంసీహెచ్ పరిధిలో 71ప్రధాన నాలాలు 169 కిలోమీటర్ల విస్తీర్ణంలోనూ ఉన్నాయి.
నాలాల సర్వే జరిగింది ఇలా...
పది మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన నాలాలకు ఇరువైపులా మూడు మీటర్ల చొప్పున వర్కింగ్ విడ్త్ ఆధారంగా, పది మీటర్లలోపు ఉన్న నాలాలకు ఇరువైపులా రెండు మీటర్ల వర్కింగ్ విడ్త్ ప్రతిపాదికన సర్వే నిర్వహించారు. నాలాలపై ఆక్రమణలు, అక్రమ కట్టడాలను ఇప్పటి వరకు ఉన్న వివరాలతో జీఐఎస్ విభాగం ఆటోక్యాడ్ సాఫ్ట్ట్వేర్ను ఉపయోగించి నాలా మొత్తం పొడవును భాగాలుగా విభజించి కొలతలు నమోదు చేశారు. నాలాల టోపోషీట్స్, రిమోట్ సెన్సింగ్ ఆధారంగా గుర్తించిన మ్యాప్ల ఆధారంగా అక్రమ కట్టడాల లెక్కలు తేల్చారు. వీటిని తొలగించేందుకు రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్, యూసీడీ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర రిమోట్, స్పేస్ అప్లికేషన్స్ శాఖ అందించిన చిత్రాలను కిర్లోస్కర్, వాయింట్స్ కన్సల్టెంట్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్, విలేజ్ మ్యాప్లను అత్యాధునిక ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి నాలాల వెంబడి ఆక్రమణలను ఈ బృందాలు గుర్తించాయి.
28 వేలకుపైనే
గ్రేటర్లో నాలాల ఆక్రమణలు, కబ్జాలు 28 వేలకుపైగా ఉన్నా యని 2016లో వయాంట్స్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే ద్వారా గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో కేవలం నాలాల్లో 12,182 అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నాయని తేల్చారు. వీటిలో కీలకమైన 43 ప్రాంతాలను గుర్తించి దాదాపు 100 కిలోమీటర్ల మేర నాలాల విస్తరణకు, ఆక్రమణలను తొలగించ డానికి రూ.230 కోట్లు ఖర్చుచేశారు. 16.60 కిలోమీటర్లలో ఉన్న 867ఆక్రమణలను తొలగించి నామమాత్రంగానే పనులు చేశారు.
సిటీలో జోన్ల వారీగా నాలాలు, ఆక్రమణల వివరాలు
జోన్ నాలాలు విస్తీర్ణం(కి.మీ) ఆక్రమణలు
నార్త్జోన్ 37 89.4 4,030
సెంట్రల్ జోన్ 39 102.51 2,809
వెస్ట్ జోన్ 41 96.47 2,684
సౌత్జోన్ 31 57.78 1,810
ఈస్ట్ జోన్ 24 44.02 849
మొత్తం 172 390.18 12,182
అటకెక్కిన విస్తరణ
జంటనగరాల్లో ఉన్న బేగంపేట, బల్కంపేట, కూకట్పల్లి, హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాలను విస్తరిస్తే ముంపు సమస్య చాలా వరకు తగ్గించవచ్చని గతంలో ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ సూచించింది. వరద నివారణకు, నాలాల అభివృద్ధికి, స్ట్రామ్ వాటర్ డ్రయినేజీ సిస్టమ్ను మెరుగుపరచడానికి పలు సూచనలు చేసింది. పదేండ్లు గడిచినా కమిటీ సూచనలను మన పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. దాంతో నాలాలు విస్తరించకపోవడంతో నాలాల పరీవాహక ప్రాంతాల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడల్లా భయాందోళన చెందుతున్నారు. ఓ చోట నాలాపై 5వేల ఆమ్రణలు ఉంటే 1100 మాత్రమే తొలగించారు. బల్కాపూర్ నాలాలపై 2700 ఉన్నట్టు గుర్తించినా ఒక్కటీ తొలగించలేదు. హుస్సేన్సాగర్ నాలాపై కూడా 11 వందల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి పదుల సంఖ్యలో తొలగించారు.
ప్రత్యేక చట్టం
గ్రేటర్లో వరదలను నివారించాలంటే చెరువులు, నాలాల పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నాలాల ఆక్రమణలో అపార్ట్మెంట్స్, ఫంక్షన్హాల్స్, దుకాణాలు, పార్కింగ్ యాడ్స్, ఇండ్లు నిర్మించుకున్నారు. వీటన్నింటినీ తొలగించడానికి రాజకీయ నేతలు అడ్డుపడుతు న్నారు. గతంలో కొంత మంది జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్లను కేటాయించి ఆక్రమణలను తొలగించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చట్టం తీసుకు రావడంతోపాటు బాధితులకు డబుల్బెడ్ రూమ్ ఇండ్లను కూడా ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. గ్రేటర్ ఎమ్మెల్యే సమావేశం అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.