Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి/ బంజారాహిల్స్/అంబర్పేట/ ఉప్పల్/ సిటీబ్యూరో
అంబర్పేటలో...
భారీ వర్షానికి అంబర్ పేట పరిధిలోని పలు ప్రాంతాలలో ఇండ్లలోకి, రోడ్లపైకి వరద నీరు వచ్చింది. చెట్లు విరిగాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. విద్యుత్ అంతరాjం కలిగింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. గోల్నాక, అంబర్ పేట, బాపూనగర్, మల్లికార్జున్ నగర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్, బతుకమ్మ కుంట, అన్నపూర్ణ నగర్, వడ్డెర బస్తీ, కష్ణానగర్, నింబోలి అడ్డా, కాచిగూడ తదితర బస్తీలలో ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వర్షంతో నిండిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాలలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్కి అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు ముంపు ప్రాంతాలలో పర్యటించారు.
మీర్జాలగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో...
మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్నగర్ డివిజన్ పరిధి, మీర్జాలగూడలో చిన్మయి స్కూల్ మార్గంలో వర్షంవల్ల వరదనీటితో రోడ్డుపై భారీగా నీరు చేరింది. ఉప్పల్ పరిధిలోని లోతట్టు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. మెయిన్ రోడ్లు చెరువుల్ని తలపించాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
బంజారాహిల్స్లో..
బంజారాహిల్స్లోని లోతట్టు ప్రాంతాలు వర్షంవల్ల నీటమునిగాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్ సహా చాలా ప్రాంతాల్లో రోడ్లపై, కాలనీల్లో వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాకపోకలకు ఆటంకం కలిగింది. కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు.
పంజాగుట్ట నుంచి అమీర్పేట్, ఖైరతాబాద్ వెళ్లేవారు మెట్రో ఫ్లై ఓవర్లపై నుంచి వెళ్లారు. యూసుఫ్గూడ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వారు కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కానీ పంజాగుట్ట నుంచి, మెహిదీపట్నం పంజాగుట్ట నుంచి ఎల్.వి.ప్రసాద్ మార్గ్ మీదుగా జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ వెళ్లేవారు ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ చౌరస్తావద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రగంలోకి దిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ట్రాఫిక్ జామ్ అయింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రెండువందలకు పైగా దుర్గా విగ్రహాలు నెలకొల్పారు. వాటి నిమజ్జనం ఉండటం, వర్షం రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో కొన్నిచోట్ల రిపేర్లకోసం గుంతలు తవ్వి వదిలేయడంతో వర్షంవల్ల ఇబ్బందిగా మారింది. ఓ చోట మ్యాన్ హోల్ వద్ద ఓ యువకుడు బైక్పై వెళ్తూ కిందపడిపోయి, మళ్లీ లేచి వెళ్లిపోయాడు. తృటిలో ప్రమాదం తప్పింది.
రంగంలోకి మాన్సూన్ బృందాలు
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న మాన్సూన్ బృందాలు తమ పరిధిలో నిలిచిపోయిన వరదనీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆమె ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు వస్తే జీహెచ్ఎంసీ కాల్సెంటర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని నగరవాసులకు సూచించారు. కంట్రోల్ రూమ్లో అధికారులు అందుబాటులో ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.