Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
నవరస స్వర సాగరం సాలూరి రాజేశ్వర రావు అని, ఆయన స్వర రచన చేసిన మధురమైన పాటలు చిరాయువులని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. సాలూరితో కలసి పాటలు పాడిన తెలుగు తొలి నేపథ్య గాయని 90 ఏండ్లు వయస్సు పైబడిన రావు బాల సరస్వతిని ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో ఆదివారం యువకళావహిని సాంస్కృతిక సంస్థ నిర్వహణలో సాలూరి రాజేశ్వరరావు శత జయంతి వేడుక సంగీత బంధురంగా నిర్వహించారు. వినోద్ బాబు, దుర్గ, పద్మశ్రీ తదితరులతో సాలూరి స్వర పరచిన ఎన్నో గీతాలను అలపించి శ్రోతలను రసానందంలో ముంచెత్తారు. అనంతరం జరిగిన సభలో ప్రముఖ లలిత సంగీత గురువులు చిత్తరంజన్, గాయని విజయ లక్మి శర్మలను సాలూరి పేరిట ఏర్పరచిన సంగీత సుధా నిధి పురస్కారాలను డాక్టర్ రమణ బహుకరించి మాట్లాడారు. నాడు సాలూరి, ఘంటసాల వంటి వారు పారితోషికాలతో నిమిత్తం లేకుండా తమ కళను అందించారని నేటి వారిలా డబ్బే ప్రధానంగా ఉంటే సినీ పరిశ్రమ నేటికి ఉండేది కాదన్నారు. అధ్యక్షత వహించిన పారిశ్రామిక వేత్త సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ సాలూరి ఆత్మాభిమానం కల వారని ఆయన స్వర పరచిన పాటలు అమత తుల్యములని అన్నారు. వేదికపై వైద్యులు గురువారెడ్డి, నటి రోజారామని, నటుడు తనికెళ్ల భరణి, సాలూరి కుమారులు కోటి, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలుకగా కార్యదర్శి మల్లికార్జున్ వందన సమర్పణ చేశారు.