Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ అడహక్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వి శేఖర్
నవతెలంగాణ-ధూల్పేట్
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ అడహక్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వి శేఖర్ అన్నారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రానున్న 8 వైద్య కళాశాలలకు 2022-23 ఏడాదికి వైద్య మండలి నుంచి అనుమతులు పొందాల్సి ఉందన్నారు. వైద్యుల పదోన్నతుల ప్రక్రియ ఆలస్యం కావడంతో రానున్న విద్యా సంవత్సరంలో నూతనంగా చేరే వైద్య విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నాత్మకంగా మారుతుందన్నారు. కొన్నేండ్లుగా నగరంలో కొంత మంది వైద్యులు తిష్టవేసి చలామణి అవుతున్నారని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టం లేక పదోన్నతుల ప్రక్రియకు అడ్డం పడటమే కాక వైద్య విద్యా సంచాలకులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవి విరమణ వయో పరిమితి 65 ఏండ్లు కాగా, అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 61 మాత్రమే ఉందన్నారు. చాలా మంది వైద్యులు అడిషనల్ డీఎంఈ పదోన్నతి పొందుటకు విముఖత చూపడమే కాకుండా నూతన వైద్య కళాశాలలకు వెళ్లడానికి సుముఖంగా లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వైద్యుల వయో పరిమితిని కూడా 61 ఏండ్ల నుంచి 65 కు పెంచడాన్ని పరిశీలిస్తుందని, తద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. వైద్యుల పదోన్నతిలో ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.