Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్/హయత్నగర్/కూకట్పల్లి/
సరూర్నగర్
నేడు సిటీలో ఉద్యోగం చేస్తున్న వారికి టూ వీలర్ అనేది ఓ కనీస అవసరంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ తమ స్థోమతను బట్టి టూ వీలరో, ఫోర్ వీలరో వాడుతున్నారు. అత్యధికమంది టూ వీలర్లు వాడుతున్నారు. ఏ చిన్నా చితకా ఉద్యోగానికి వెళ్లాడానికైనా నేడు యువత, మహిళలు, పురుషులు బైకునో, స్కూటినో తప్పక వాడాల్సిన పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. నెలకు రూ. 10 నుంచి 20 వేలలోపు సంపాదించే ప్రయివేటు ఉద్యోగుల్లో అత్యధికంగా టూ వీలర్లు వాడుతున్నారు. అయితే ఇటీవల రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో తమ బతుకులు ఆగమవుతున్నాయని, చాలీ చాలని జీతాలతో అటు కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు, ఇటు బండ్లకు పెట్రోలు వాడటం చాలా ఇబ్బందిగా మారుతోందని కుత్బుల్లాపూర్కు చెందిన దినేష్, బంజారాహిల్స్కు చెందిన రాధిక, రాంనగర్కు చెందిన కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో తమ బతుకులు ఆగమైతున్నయని రాంనగర్కు చెందిన పేరు చెప్పడానికి ఇష్ట పడని ఓ ప్రయివేటు ఉద్యోగి తెలిపారు. ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ప్రవళిక కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తమ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నామని పేర్కొన్నారు.
ఒకప్పుడు నెలకు రూ. 15 నుంచి 18 వందల లోపు తాను పెట్రోల్కు ఖర్చు చేసేదని, ఇటీవల నెలకు రూ. 3 వేలకు పైగానే అవుతోందని రూపకళ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన స్కూటీ అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. శంషాబాద్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి చిక్కడ పల్లిలో అమ్ముకునే తనకు ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చు పెరిగి ఎటువంటి లాభమూ రావడం లేదని కూరగాయల వ్యాపారి చంద్రయ్య వాపోయారు. ధరల పెరుగుదలతో బతుకుదెరువు కష్టమవుతోందని చెప్పారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు అనేకమంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, దుకాణాలు, షాపింగ్స్ మాల్స్లో పనిచేసేవారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధనవంతులు ప్రయాణించే విమాన ఇంధన ధరలు రూ. 79 అయితే, తాము ఉపయోగించే బైకులో లీటరు పెట్రోలుకు రూ. 110కి పైనే చెల్లించాల్సి వస్తోందని, ఈ విధంగా ధరలు పెంచడం ఎంత వరకు సమంజసమని సికింద్రాబాద్కు చెందిన మహేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఉద్యోగం చూసే మౌనిక, శ్రీలత, రవళి, వెంకటేశ్, శేఖర్లు కూడా ఇదే అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. వీరేకాదు పేద, మధ్య తరగతి ప్రజల నుంచి పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర ధరల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.