Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో
కేంద్రం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-అంబర్పేట
ఉత్తప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరిలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్యకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజరు మిశ్రాను తక్షణమే బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్ చేసింది. ఆ ఘటనకు నిరసనగా సోమవారం అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని శ్రీ రమణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా పది నెలలుగా నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు కేంద్రం అనేక విధాలుగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే లఖీంపూర్ ఘటన కూడా జరిగిందని, హత్యా రాజకీయాలను ఖండిస్తున్నామని తెలిపారు. నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను ప్రధానమంత్రి పరామర్శించకపోవడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. సీపీఐ(ఎం) అంబర్ పేట జోన్ కార్యదర్శి ఎం. మహేందర్ మాట్లాడుతూ.. రైతు హత్యలకు కారణమైన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర నాయకులు ఎం. దశరథ్, నగర కమిటీ సభ్యులు అజరు బాబు, ఎన్ మారన్న, పి. విమల తదితరులు పాల్గొన్నారు.