Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నర్సీపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రాతోపాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ప్రధాన నిందితుడిని అఫ్జల్గంజ్, నార్త్జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నాలుగు లక్షల విలువగల 40కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగరపోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ సీపీ రమేష్రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి సీపీ అంజనీకుమార్ వివరాలను వెళ్లడించారు. నర్సిపట్నంకు చెందిన వనపల్లి నాగ సాయి స్థానికంగా క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. గంజాయి సరఫరా చేస్తే సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆలోచించిన నిందితుడు గంజాయి స్మగ్లింగ్పై దృష్టి సారించాడు. నర్సిపట్నంలో ఏజెన్సీ ప్రాంతంలో కిలో గంజాయి రూ.1500లకు కొనుగోలు చేస్తున్న నిందితుడు మహారాష్ట్రా, ముంబాయికి తరలిస్తున్నాడు. ముఖ్యంగా నర్సీపట్నం నుంచి అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్ మీదుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి జహిరాబాద్ మీదుగా మహారాష్ట్రా, ముంబాయికి గంజాయిని తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కావాల్సిన వారికి కిలో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సరఫరా చేస్తున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాడని సీపీ తెలిపారు. నిందితునితో చేతులు కలిపిన నారాయణ్ఖేడ్కు చెందిన ప్రేమ్ సింగ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, రవీందర్రెడ్డి, ఎస్ఐలు శ్రీకాంత్, బి.పరమేశ్వర్, బి.అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.