Authorization
Thu April 10, 2025 10:33:11 am
నవతెలంగాణ-ఓయూ
లింగ సమానత్వ సాధనకు చట్టపరమైన రక్షణలు సరిపోవు అని ఓయూ సీఐపీ డైరెక్టర్ కొండా నాగేశ్వర్, దూరవిద్య డైరెక్టర్ ప్రొ జీబీ రెడ్డి అన్నారు. ఓయూ సీఐపీ లెక్చర్ సిరీస్లో భాగంగా మంగళవారం లింగ సమానత్వం: చట్టపరమైన దృక్కోణాలు' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఓయూ దూరవిద్య డైరెక్టర్ ప్రొ జీబీ రెడ్డి ప్రసంగించారు. భారతదేశంలో లింగపరమైన సమానత్వం కేవలం సానుభూతికి మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. అనేక యుగాలుగా స్త్రీ ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చబడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక భారతదేశంలో మహిళలకు కల్పించబడిన అనేక రకాలైన సమానత్వ అవకాశాలను వివిధ సెక్షన్ల వారీగా, వివిధ సుప్రీం కోర్టు కేసులను రిఫరెన్స్గా ఉదాహరించారు. 'దిశా' లాంటి సంఘటనలు దేశంలో జరగటానికి సామాజిక బాధ్యత లేకపోవడమేనని పేర్కొన్నారు. కేవలం చట్టపరమైన రక్షణ ద్వారా మాత్రమే లింగపరమైన సమానత్వాన్ని సాధించలేమని, పౌరసమాజం దీన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'లీగల్ ఈక్వాలిటీ' మాత్రమే కాకుండా 'రియల్ ఈక్వాలిటీ' రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.