Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఓవైపు రాజ్యాంగ హక్కులు లేక.. మరోవైపు రాజకీయ పలుకుబడి లేక బీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమవుతున్నారు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పి. కృష్ణయ్య, టీ చిరంజీవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడంతో ఎంతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్న ఏ కులానికి లేని క్రీమిలేయర్ బీసీ ఉద్యోగులకు ఎందుకు వర్తిస్తుందని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులు ఐక్యంగా ఉండి వారి హక్కులను కాపాడుకోవడంలో బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులు బీసీ కులాల్లో చైతన్యం.లేని సంచార జాతులను చైతన్యవంతం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని, వారందర్నీ ఉన్నత చదువుల వైపు వెళ్లే విధంగా ప్రతి బీసీ ఉద్యోగి కృషి చేయాలన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కుందారం గణేష్ ఆచారి, బీసీ ఉద్యోగుల సంఘం కోశాధికారి శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అజరు కుమార్, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంగాపురం పద్మ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్, చరణ్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.