Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ నియామకం, దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 21న కేవీపీఎస్ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న దళితుల మహాధర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్కు చైర్మెన్ లేక దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ కమిషన్కు చైర్మెన్ను నియమించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత వాడలను అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 21న మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాకు దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు అశోక్, అంజన్న, స్వామి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.