Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కీలకమైన కేంద్రం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలంతా ఒకెత్తయితే జీహెచ్ఎంసీ మరోఎత్తు. ఇక్కడి కార్పొరేటర్లు, స్థాయీ సంఘం, పాలకమండలి విస్తృ అధికారాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ స్థాయి అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుంది. మేయర్కు కేబినెట్ ర్యాంకు. వీటన్నింటిలో స్థాయి సంఘం సభ్యులు అంటే ప్రత్యేక హోదా. కానీ ఇక నుంచి స్టాండింగ్ కమిటీ ఉండకపోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అధికారుల నుంచి కూడా అవుననే సమాధానం వస్తోంది.
స్టాండింగ్ కమిటీ ఇలా..
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) ఏర్పడినప్పటి నుంచి స్టాండింగ్ కమిటీ ఉన్నది. మేయర్తోపాటు స్టాండింగ్ కమిటీ చైర్మెన్గా మరో వ్యక్తి ఉండేవారు. క్రమంగా స్టాండింగ్ కమిటీ చైర్మెన్గా మేయర్ ఉండేలా మార్చేశారు. 2007లో ఎంసీహెచ్ను జీహెచ్ఎంసీగా మార్చిన తర్వాత 2009లో పాలకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2021 ఫిబ్రవరి 10వరకు స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవి ఉన్నది. ఆ తర్వాత ఫిబ్రవరి11న కొత్త పాలకమండలి ఏర్పడి 10 నెలలు గడిచినా స్టాండింగ్ కమిటీ ఊసేలేదు. అయితే గతంలో టీఆర్ఎస్, మజ్లీస్పార్టీలు సంయుక్తంగా స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సారి స్టాండింగ్ ఎన్నికలే నిర్వహించలేదు. అసలు ఉంటుందా? లేదా? స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది.
కమిషనర్..పాలకమండలినే
గ్రేటర్లో ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి, తక్షణమే పనులు మంజూరు చేయడానికి ప్రతివారంలో ఒక రోజు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. అయితే రూ.2కోట్లలోపు పనులకు కమిషనర్ స్థాయిలో మంజూరుచేయడానికి అవకాశముంది. రూ.2కోట్ల నుంచి 3కోట్ల వరకు మంజూరు చేయాలంటే స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిందే. రూ.3కోట్ల నుంచి 6కోట్ల వరకు మంజూరు చేయాలంటే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. రూ.6 కోట్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. అయితే ఇక నుంచి స్టాండింగ్ కమిటీ అధికారాలను సైతం కమిషనర్కు అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.
కార్పొరేటర్లకు నిధుల్లేవు
జీహెచ్ఎంసీ దివాళ తీసింది. ప్రభుత్వం నుంచి వాటాగా రావాల్సిన నిధుల్లో నయాపైసా విడుదలచేయలేదు. పైగా అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. అందులోభాగంగానే జీహెచ్ఎంసీ ఐదేండ్ల కాలంలో రూ.5 వేల కోట్లకుపైగా అప్పులు చేసింది. దీంతోపాటు గతంలో శివారు ప్రాంతాల్లోని ఒక్కో కార్పొరేటర్కు ఏడాదికి రూ.2.5 కోట్లు, కోర్సిటీ(పాత హైదరాబాద్)లో ఒక్కో కార్పొరేటర్కు ఏడాదికి రూ.2 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించారు. కానీ 2016లో ఏర్పడిన కొత్త పాలకవర్గంతోపాటు ప్రస్తుతం పాలకవర్గంలోని కార్పొరేటర్లకు నయాపైసా బడ్జెట్ ఇవ్వడంలేదు.