Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ విస్తరణకు నిరంతరం కృషి చేయాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బాస్
17 మందితో గ్రేటర్ హైదరాబాద్
సౌత్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్టీని ప్రజల్లో మరింత విస్తరించేందుకు ప్రతీ కార్యకర్త, సభ్యుడు కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ అబ్బాస్ అన్నారు. హైదరాబాద్ మలక్పేట్లోని సంహిత కాలేజ్ (అబ్దుల్ సత్తార్ ప్రాంగణం)లో గురువారం గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా 3వ మహాసభ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. సౌత్ జిల్లా పరిధిలో ఏఏ సమస్యలు ఉన్నాయో.. ఈ మూడేండ్ల కాలంలో వాటిని ఎలా పరిష్కారించాలో ఈ మహాసభలో చర్చించామన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో డబుల్ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు, మహిళలకు రక్షణ, విద్య, అధిక ఫీజులు వంటి సమస్యలపై పోరాటం చేయడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. తద్వారా పార్టీ విస్తరణకు కృషి చేయాలన్నారు. అలాగే ఫుట్పాత్ వర్కర్లు, మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో కార్మికులు, చెత్తరిక్షా, ఆశా, అంగన్వాడీ, కాంట్రాక్టు వర్కర్స్, తదితర రంగాలలో ఉన్న సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించాలన్నారు. ప్రజల్లో ఉన్నంతసేపు కమ్యూనిస్టు కార్యకర్త అని, దానికి దూరంగా ఉండేవాడు కమ్యూనిస్టే కాదని అన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) జెండా ఎగురవేసే అవకాశముందన్నారు. అంతకుముందు వివిధ రంగాలపై 15 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. అనంతరం 17 మందితో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా నూతన కమిటీని 17 మందితో ఎన్నుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు.
సౌత్ జిల్లా నూతన కమిటీ
ఎన్.సోమయ్య(కార్యదర్శి), జి. విఠల్, అబ్దుల్ సత్తార్, ఎల్.కోటయ్య, ఎం.మీనా, ఎం.లక్ష్మమ్మ, ఎం. బాలునాయక్, ఎం. శ్రావణ్ కుమార్, కిషన్, పి. నాగేశ్వర్, పి. శశికళ, టి. సత్తయ్య, అబ్దుల్ లతీఫ్, ఏ. కృష్ణ, బాబార్ ఖాన్, కె. జంగయ్య, శంకర్(బీడీఎల్), కల్యాణ్ (ఆహ్వానితులు), రాంకుమార్ (ఆహ్వానితులు).
తీర్మానాలు..
జిల్లా మహాసభలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అసంఘటిత రంగ కార్మికులు, దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక కృషి, ఫలక్ నుమా వరకు మెట్రో రైలు, విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాలపై తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టగా మహాసభ ప్రతినిధులు వీటిని ఆమోదించారు.