Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఆర్థికాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం సోషలిజం ఆలోచనలతో అప్పటి ప్రధాని నెహ్రు భారీ కర్మాగారాలు, ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసిన జాతీయ ఆస్తులను నేడు ప్రధాని మోడీ 'క్లియరెన్స్ సేల్'' పెట్టి తన కొంత మంది 'బిజినెస్ ఫ్రెండ్స్' ప్రయోజనాల కోసం అడ్డగోలుగా అమ్ముకుంటున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గురువారం హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో సీపీఐ హైదరాబాద్ జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మహమ్మద్ సలీం అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్బంగా సాంబశివరావు మాట్లాడుతూ రూ.60 లక్షల కోట్ల విలువైన జాతీయ ఆస్తులను రూ.6 లక్షల కోట్లకు విక్రయించడం దారుణమన్నారు. జాతీయ ఆస్తులను విక్రయించే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశ ప్రాథమిక నిర్మాణానికి భంగం కలిగిస్తున్నాయని, వారి విధానాల ఫలితంగా ఇంధన ధరలు రూ.111 మార్క్ దాటిందని, ఇక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగంకు అంతే లేదని విమర్శించారు. జవాబుదారీతనం లేని మోడీ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదన్నారు. నరేంద్ర మోడీ వ్యాపార ఆలోచనలు, విభజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా, దేశ రక్షణ కోసం పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సీపీఐ శ్రేణులు కీలక భూమిక పోషిస్తూ శక్తివంతమైన పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు. సమావేశంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్.శంకర్ నాయక్, ఎం.నరసింహ, ఎస్.ఛాయాదేవి, నగర కార్యవర్గ సభ్యులు కమతం యాదగిరి, శంషుద్దీన్, బి.స్టాలిన్, నెర్లకంటి శ్రీకాంత్, మామిడి చెట్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.