Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
డీఎంఈ సైడ్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు గురువారం కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 8 వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. సకాలంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తే వారు ఆయా వైద్య కళాశాలలో తమ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. లేనిపక్షంలో సరైన సౌకర్యాలు లేవన్న కారణంతో నూతన వైద్య కళాశాలలకు భారత వైద్య మండలి అనుమతులు లభించకుండాపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. డీఎంఈ సైడ్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించిన తర్వాతనే మిగిలిన పోస్టుల్లో ఇతరుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని, అన్ని కేటగిరిలో సకాలంలో పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా వైద్య శాఖలో అవినీతి ప్రక్షాళన చేస్తున్న డీఎంఈ పై కొందరు వైద్యులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాల పేరిట వైద్యులలో చీలిక తెచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ పి రాజేశ్వర్, డాక్టర్ వినోద్, డాక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.