Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
- బంజారాహిల్స్లో సఖీ కేంద్రం భవననిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-బంజారాహిల్స్
మహిళా రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిస్తోందని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మిథిలానగర్లో నూతన సఖీ కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణిదేవి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా, శిశుసంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్, కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ పద్మనాభ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.40 లక్షలు జతచేసి సఖీ కేంద్రానికి పెద్ద భవనం నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. మహిళల రక్షణ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సఖీ కేంద్రం కోసం స్థలాన్ని ఇచ్చినందుకు మేయర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్కు ధన్యవాదాలు తెలియజేశారు.
గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం
గంజాయి వల్ల నేరాలు పెరుగుతుండడంతో వాటి సాగు, విక్రయాలపై ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం ఇటీవలే ప్రత్యేక సమావేశాలు పెట్టి నిర్ణయించారని చెప్పారు. పిల్లల విషయంలో తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలని, ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడిన దోషులను కూడా సకాలంలో పట్టుకుని శిక్షిస్తున్నామని వెల్లడించారు. నగరంలో మహిళల సమస్యల పరిష్కారం విషయంలో అందరిలో నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా అన్ని సేవలు ఈ సఖీ కేంద్రంలో ఉంటాయని, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఈ కేంద్రం రావడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 33 జిల్లాల్లో సఖీ కేంద్రాల భవనాలకు స్థలాలు, నిధులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం పోలీసుల ఆధ్వర్యంలో భరోసా కేంద్రం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కలెక్టర్ల ఆధ్వర్యంలో సఖీ కేంద్రం నడుస్తున్నాయని, మహిళల పట్ల నేరాలు తగ్గించే విధంగా వారికి న్యాయపర సేవలు సకాలంలో ఇచ్చే విధంగా కేంద్రాలు పని చేస్తాయని ఆమె స్పష్టం చేశారు.