Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ సీసీఏ రూల్స్ అతిక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కులాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు శుక్రవారం కోఠిలోని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ వినోద్, డాక్టర్ శేఖర్, డాక్టర్ పి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వీసులో ఉంటూ వివిధ సంఘాలు, జేఏసీల పేరుతో వివిధ రాజకీయ నాయకులతో చేతులు కలిపి ప్రభుత్వంపై ఉసిగొలిపే వైద్యులను సీసీఏ రూల్స్ ప్రకారం సర్వీస్ నుంచి తొలగించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో వైద్య సంఘాల పేరుతో, అధికారులను బెదిరించి అవినీతికి పాల్పడ్డారని, దీనిని ప్రశ్నించినందుకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. సీసీఏ నిబంధనలను అనుసరించి ప్రభుత్వం, వైద్యాధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎంఈ రమేష్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.