Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన కొమురం భీమ్ ఆదివాసీల ఆరాధ్యదైవం అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం భీమ్ జయంతిని పురస్కరించుకొని గిరిజన నాయకులతో కలిసి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈసందర్భంగా బంజారాహిల్స్లో బంజారాభవన్ను ప్రారంభించారు. కొమురం భీమ్ చిన్నతనం నుంచే పోరుబాట పట్టి తన ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బానిసత్వపు సంకెళ్లు తెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులని, పోరాటయోధులని కొనియాడారు. కొమురం భీమ్ ఆశయాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చి గిరిజనులకు పాలనాధికారాన్ని అందించిన నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. జోడేఘాట్లో రూ.25 కోట్లతో కొమురం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేసే గొప్ప ఉద్యమ కేంద్రంగా తయారు చేశారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో ఆదివాసీల ఆత్మగౌరవం నిలిపేలా రూ. 25 కోట్లకు పైగా ఖర్చుతో కొమురం భీమ్ ఆదివాసీ భవన్ నిర్మాణం చేశారన్నారు. ఆయన్ను స్మరించుకుంటూ అక్టోబర్ 22న తెలంగాణ ప్రభుత్వం కొమురం భీమ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు.