Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న డీఎన్ఏ మాలిక్యులర్ బయా లజీ లేబరేటరీకి శనివారం హౌం మంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోలీసు విభాగానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.17 కోట్లతో మూడు అంతస్తుల్లో నిర్మితమ వుతున్న ఈ లాబరేటరీ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తవుతుందనీ, దీనికి అత్యంత ఆధునిక సామాగ్రిని అనుభవజ్ఞులైన ఫోరెన్సిక్ సిబ్బందిని సమకూరుస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసుల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ నేరస్తులను పట్టుకోవడంలో, నేరాలను ముందే పసిగట్టి నిరోధించడంలో పోలీసులకు ఈ లేబరేటరీ చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖా గోయల్ మాట్లాడుతూ ఈ లేబరేటరీ వల్ల పోలీస్ అధికారులు నేర పరిశోధనకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలను త్వరగా పొందగలు గుతారనీ, తద్వారా నేరస్తులను పట్టుకోవడం సులువు అవుతుందని తెలిపారు. సాక్ష్యాధారాలను శాస్త్రీయంగా రూపొందించి కోర్టుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడంలో ఈ లేబరేటరీ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఫోరెన్సిక్ విభాగపు సంచాలకులు అభిలాష మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగ పటిష్టతకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ పాల్గొన్నారు.