Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దృష్టి సారించేలా అవగాహన కల్పించాలి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా రైతులు వరి పంటకు బదులుగా వేరే పంటలు సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు తెలియజేసేందుకు జిల్లాలోని వ్యవసా యశాఖ, ఉద్యానవనశాఖ, విత్తనాల డీలర్లతో పాటు అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రానున్న యాసంగి సీజన్లో వడ్లు, ముడి బియ్యంతో పాటు ఉప్పుడు బియ్యం ( పారా బాయిల్డ్ ) బియ్యం కొనుగోలు చేయలేమని చెప్పిన నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్నదాతలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా వరి పంటకు బదులుగా వేరుశనగ, కంది, పెసర, మినుముతోపాటు కూరగాయల పంటలు సాగు చేసేలా వ్యవసాయశాఖతో పాటు ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల్లో మార్పుతోపాటు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా ప్రత్యమ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుములు, పెసర, తదితర పంటలు పండించేలా, భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో మొత్తం రైతులు ఎంత మంది ఉన్నారు, ప్రతి ఏడాది ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు, ముందు ఏ పంటను పండించారు, ఇప్పుడు ఏ పంటలు పండిస్తున్నారని మొత్తం వివరాలతో జాబితా తయారు చేయాలన్నారు. కూరగాయలు, పందిరి సాగు పంటలు పండించేలా చూడాలనీ, దీనికి ప్రభుత్వం రాయితీ అందజేస్తుందనే వివరాలను ప్రతి రైతుకూ తెలియజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రేపటి నుంచి ప్రారంభించి నాలగు రోజుల్లో అన్ని గ్రామాల్లో రైతు వేదిక సమావేశాలు పూర్తి చేయాలని తెలిపారు. గ్రామంలో ఉన్న రైతులందరూ రైతు వేదిక సమావే శాల్లో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల ను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్ళేందుకు కొత్తకొత్త పద్దతుల్లో సాగు చేసే వివరాలను సైతం వారికి అవగాహన కల్పిస్తే రైతురాజు అనేది తప్పకుండా నిజమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవి, మల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ, డీహెచ్ఎస్వో సత్తార్, ఏడీ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతోపాటు ఆయా విత్తనాల డీలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.