Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గంజాయి స్మగ్లింగ్, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్నాళ్లు ఓ లెక్కా..10 రోజుల నుంచి మరో లెక్కా అన్నట్టు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి మాఫియాను పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నారు. సిటీలో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు స్మగ్లర్ల కదిలికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్ధరాత్రిళ్లు గంజాయిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన యువతీయువకులతోపాటు సరఫరాదారులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ 10 రోజల వ్యవ ధిలోనే వందలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీ సులు 70కిపైగా కేసులు నమోదు చేశారు. ఈ మూడు రోజుల్లో 36 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 50 మందిని అరెస్ట్ చేశారు.
సరదాకోసం దమ్ము.. ఏజెంట్లుగా అవతారం..
గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలన్న సరదా యువత భవిష్యత్ను బలి తీసుకుంటోంది. తోటి స్నేహితులను చూసి కొందరు సిగరేట్ దమ్ముతో మొదలు పెట్టి, గంజాయికి అలవాటు పడుతున్నారు. మరింత కిక్కుకోసం మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా కోడ్ భాషలతో గంజా యిని ఆర్డర్ చేస్తున్నారు. పూర్తిగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువకులు వాటి సరఫరా దారులుగా మారుతు న్నారు. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
పాన్ షాపుల నుంచి గంజాయి కేంద్రాల వరకు తనిఖీలు
గ్రేటర్ హైదరాబాద్లో గంజాయిని పూర్తిస్థాయిలో నివారిం చేందుకు 10 రోజుల నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. గల్లీల్లో పాన్ షాప్ల నుంచి కిరాణ దుకాణాలు, గోదాంలను తనిఖీ చేస్తున్నారు. అంతేగాక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, ఫ్లైఓవర్ల కింద, ప్లే గ్రౌండ్లు, పాడువడిన మైదానాలు తదితర ప్రాంతాలల్లో టాస్క్ఫోర్సు, స్పెషల్ పోలీసు టీమ్లతో ప్రత్యేక నిఘా వేశారు. ఒకటికి నాలుగు సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
ఇద్దరిపై పీడీయాక్టు
ఎన్ని సార్లు హెచ్చరించినా గంజాయి స్మగ్లర్లలో మార్పు రాకపోవడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేశారు. మంఘల్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఏ.రోహిత్సింగ్ సిటీలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. బంజారాహిల్స్కు చెందిన మహ్మద్ సల్మాన్ డ్రగ్స్కు బానిస య్యాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తున్నాడు. ఎన్నిసార్లు జైలుకెళ్లొచ్చినా మార్పురా కపోవడంతో నాంపల్లి పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు.
మూడు రోజుల్లో 36 ఎఫ్ఐఆర్లు
గంజాయి సరఫరాను అరికట్టేందుకు పది రోజులుగా సిటీలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుటున్నారు. ఈ నెల 24న 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 18 మందిని అరెస్టు చేశారు. 25న 13 మందిపై ఎఫ్ఐఆర్లను నమోదుచేసి 21 మందిని అరెస్టు చేశారు. 26న 11 ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన పోలీసులు, 9 పెటీ కేసులు నమోదు చేశారు. 11 మందిని అరెస్టు చేశారు. మూడు రోజుల్లో 36 ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. ఇదిలా వుండగా పది రోజుల్లో ముగ్గురు ఎస్ఐలతోపాటు ఒక సీఐని సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.