Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు కేంద్ర మంత్రులను వెంటనే తమ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. మంగళవారం హిమాయత్నగర్, లిబర్టీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. అనంతరం జి.చెన్నయ్య మాట్లాడుతూ ఇటీవల నగరానికి వచ్చిన కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, నారాయణస్వామి, ఎల్.మురుగన్ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తివేసిన మాదిరిగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు ఏడుగురు లేక తొమ్మిది మంది న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమేనని అన్నారు. గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ వర్గీకరణను జాతీయ సమస్యగా మెజారిటీ రాష్ట్రాలు అంగీకరించలేదని, ఇది సాధ్యం కాదని ప్రకటించారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు ఎమ్మార్పీఎస్ నాయకులుగా వ్యవహరిస్తూ ద్వంద వైఖరితో మాదిగలను రెచ్చగొడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాలల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ కమిషన్ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులను తమ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్కు సంఘీభావం, న్యాయం అందించాలనే ముసుగులో బీజేపీ ఆర్థిక సహకారాలు అందిస్తూ మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రుల వ్యాఖ్యలపై రాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్ లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, కార్యనిర్వాహక అధ్యక్షులు జంగా శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షులు జి.రమేష్, నాయకులు మల్లికార్జున్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.