Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఐటీ కారిడార్లో మరో రాచమార్గం రాబోతున్నది. ఇప్పటికే బయో డైవర్సిటీ వద్ద రెండు ఫ్లైఓవర్లు, మైండ్స్పేస్ వద్ద ఫ్లైఓవర్, అండర్పాస్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45, అయ్యప్ప సొసైటీ వద్ద అండర్ పాస్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఐటీ కారిడార్కు రాచబాట వేశారు. ఇందులో భాగంగానే షేక్పేట సెవెన్ టూంబ్స్ నుంచి షేక్పేట ఓయూ కాలనీ జంక్షన్ మీదుగా రాయదుర్గం విస్పర్ వ్యాలీ వరకు 2.8 కిలోమీటర్ల మేర రూ.333.55 కోట్లతో చేపట్టిన పనులు 93 శాతం పూర్తయ్యాయి. ఫ్లైఓవర్ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తున్నది.
ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట
మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు ఉన్న ఇన్నర్ రింగు రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. దీంతోపాటు ఐటీ కారిడార్కు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఈ రహదారిలో ఫ్లైఓవర్ ఏర్పాటును ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్తో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాలకు వెళ్లే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు సాఫీగా ప్రయాణం చేయడానికి అవకాశముంది. ఉద్యోగుల సమయాన్ని, ఇంధనాన్ని వృథా చేయకుండా ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. షేక్పేట సెవెన్ టూంబ్స్ జంక్షన్ సమీపంలో ప్రారంభమై విస్పర్ వ్యాలీ (రాయదుర్గం జంక్షన్) వరకు పలుచోట్ల వివిధ మతపరమైన కట్టడాలు ఉండటంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని విశాలంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం మొదట సర్వీస్ రోడ్ను నిర్మించి ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఫ్లై ఓవర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్కు వెళ్లే వారికి భారీ ఉపశమనం లభిస్తుంది.
త్వరలోనే...
నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన నేపథ్యంలో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో బీటీరోడ్లు, సీసీరోడ్లు, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, అండర్పాస్లు నిర్మించి హైదరాబాద్ ప్రాముఖ్యతను మరింతగా పెంపొందించేందుకు విశేష కృషిచేస్తోంది. ఇప్పటికే గ్రేటర్లో పలు ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టాయి. మున్సిపల్, పట్టణాభివృద్ది, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో నగరంలో పలు రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు నిర్ణయించి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 6 లేన్లు గల రెండు ఫ్లైఓవర్లు వయా షేక్పేట్ ఫిలింనగర్ జంక్షన్ ఓయూ కాలనీజంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్నది. హైటెక్ సిటీ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఈ మధ్యంతర రింగ్ రోడ్ నిర్మాణంవల్ల ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి. రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలకు సులభతరం అవుతుంది. 74 పిల్లర్స్ నిర్మాణాలు పూర్తయ్యాయి. 72 ఫియర్ క్యాప్స్ పూర్తిచేశారు. 440 పీఎస్సీి గడ్డర్లను నిలబెట్టడం పూర్తిచేశారు. 144 కాంపోసిట్ గ్రీడర్స్ పూర్తిచేశారు. 73 స్లాబ్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పటి వరకు 93 శాతం పూర్తికాగా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.