Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ బస్తీలో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్స్ డిపార్ట్మెంట్కు చెందిన 20ఎకరాల స్థలంలో గత ఏండ్ల కిందట పేదలు గుడిసెలు వేసుకొని రేకుల గదులు నిర్మించుకొని జీవించేవారు. అయితే అనేక పర్యాయాలు అక్కడ గుడిసెలు వేసుకున్న పేదవారిని తొలగించారు. చివరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ఆ స్థలాన్ని పేదలకే వదిలి వేశారు, కానీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అయితే గత 15 ఏండ్ల నుంచి మాత్రం ఇష్టానుసారంగా ఆక్రమించుకుని అనుమతులు లేకుండా 50, 100 గజాలలో మూడు నుంచి ఐదు అంతస్తుల వరకు భవనాలు నిర్మించుకున్నారు. కనీసం అంబులెన్స్ కూడా సరిగ్గా వెళ్లలేని స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే అలాంటి ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
రహ్మత్నగర్ బాప్టిస్ట్ చర్చి పక్కన 400 గజాల స్థలంలో ఓ పూజారి కుటుంబం జి ప్లస్ వన్ ఒక అంతస్తు వేసుకున్నారు. అయితే సుభాషిణి మహిళ పూజారి కుటుంబం అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని, దీనిపై జీహెచ్ఎంసీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్ వేశారు. కాగా అక్రమ నిర్మాణం ఎందుకు అడ్డుకోలేదని సర్కిల్ 19 టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్కు కోర్టు నోటీసుల జారీ చేసింది. దీంతో సుమారు 20 మంది జూబ్లీహిల్స్ పోలీసు అధికారులు, మహిళా పోలీసులతో కలిసి పూజారి ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే రహమత్నగర్లో ఇండ్ల నిర్మాణంలో ఎవరికీ అనుమతులు లేవని, తమ ఇంటి పక్కనే వంద గజాల్లో నాలుగంతస్తులు అనేకమంది నిర్మించారని, తప్పుడు ఫిర్యాదు చేస్తే తమ ఇంటి ఎందుకు కూలుస్తున్నారని ఇంటి యజమానురాలు గాయత్రి దేవి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదేవిధంగా తమె కుమారుడు కూడా తల పగల కొట్టుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. చివరకు ఇంటి యజమాని ఇద్దరు కుమారులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళా పోలీసులతో ఇంటి యజమానురాలును నిర్బంధించి మొదటి అంతస్తులో ఉన్న ఇటుక గోడను కూల్చివేసి వెళ్లిపోయారు. బ్రాహ్మణ పూజారులమైనా తమకు అన్యాయం జరిగితే స్థానిక నాయకులు ఎవరూ పరామర్శించలేదని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం
రహ్మత్నగర్ బస్తీలో ప్రభుత్వం ఎవరికీ ఇండ్ల పట్టాలు జారీ చేయలేదు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన స్థలంలో వారికి మాత్రమే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం. రోడ్డు, కాలువలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అలాంటి వాటిని వెంటనే కూల్చివేస్తాం. పట్టాదారులు అనుమతులు తీసుకుని ఇండ్లు నిర్మించుకోవాలి. అక్రమంగా నిర్మించి కూల్చి వేసిన తర్వాత నష్టపోవద్దు.
-శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ-19