Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మాదకద్రవ్య, పొగాకు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పోలీసులు తనిఖీలు, దాడులు ముమ్మరం చేశారు.. అందులో భాగంగా నిషేధిత గుట్కా సరఫరా కేంద్రాలపై చిలకలగూడ పోలీసులు కొరడా ఝుళిపించారు. పూజా సామాగ్రికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తున్నామని నమ్మించి గుట్కా, పొగాకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠాను చిలకలగూడ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. యువతను లక్ష్యం గా చేసుకుని గోపాలపురం డివిజన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం డివిజన్ ఏసీపీ ఎన్.సుధీర్ కుమార్ బుధవారం చిలకగూడా పొలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మైలార గడ్డ వద్ద ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు దాడులు నిర్వహించి నిషేధిత గుట్కా తోపాటు నవీన్ కుమార్ అనే వ్యక్తి అరెస్టు చేశారు. నవీన్ కుమార్ను ప్రశ్నించిన పోలీసులు నిషేధిత గుట్కాకు సంబంధించి తీగలాగితే బహదూర్పురా తయారికేంద్రం గోడౌన్ డొంక కదిలింది. ఈకేసులో రూ 44 లక్షల విలువైన నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మైలర్ గడ్డకు చెందిన నవీన్ కుమార్, కాచిగూడ కు చెందిన గోవింద్, సూరారం ప్రాంతానికి చెందిన సింహాద్రి, బహదూర్పురా కు చెందిన అగర్వాల్ ప్రదీప్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిషేధిత గుట్కా సరఫరా కేంద్రాలపై దాడులు చేసి వారిని అరెస్టు చేసిన చిలకలగూడ సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. తమ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా నిషేధిత పదార్థాలు విక్రయిస్తున్న వారిపై 8 మంది పై కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో చిలకగూడా ఇన్స్పెక్టర్ ఎన్.నరేష్, అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్, సాయి కష్ణ, ప్రకాష్, నరసింహ రెడ్డి, వినరు, శ్రీనివాసులు, సతీష్ పాల్గొన్నారు.