Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంతలమయంగా రోడ్లు
- పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, చుట్టుపక్కల ప్రజలు
- ఛేే నెంబర్లో కొనసాగుతున్న పనులు
నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట ఛే నెంబర్ చౌరస్తాలో ఓ వైపు రోడ్డు వెడల్పు పనులు, మరో వైపు రోడ్డు మధ్యలో వంతెన నిర్మాణ పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. రెండూ ఒకేసారి కావడంతో పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులు, చుట్టు పక్కల ఇండ్ల వారికి శాపంగా మారుతోంది. నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. దీనికితోడు దుమ్ము, ధూళితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటం, నిత్యం వాహనాలు ఎక్కువగా తిరుగుతుండటంతో అంబర్పేట చే నెంబర్ నుంచి ముక్కురాం హౌటల్ వరకు 1.6 కిలో మీటర్ల మేర ప్లై ఓవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2017లో నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి అంబర్పేట ఎమ్మెల్యే కిషన్రెడ్డి, మంత్రి కేటీఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్లై ఓవర్ నిర్మాణానికి రూ.216 కోట్లతో ఎస్టిమేషన్ చేశారు. 2023 వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు నాలుగేండ్లుగా పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో వాహనదారులు, చుట్టు పక్కల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో పనులు ఆలస్యంగా జరుగున్నాయి. నిర్మాణ సమయంలో చుట్టు పక్కల వారికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నెలలుగా పనులు కొనసాగుతుండటంతో ప్రస్తుతం చే నెంబర్ చౌరస్తా నుంచి శ్రీరామ చౌరస్తా వెళ్లే మార్గమంతా అధ్వానంగా తయారైంది. మొత్తం గుంతల మయంగా మారింది. వర్షాకా లంలో ఆ సమస్య మరీ తీవ్రంగా మారుతోంది. ఇక ప్రస్తుత వాతా వరణ మార్పులతో పొడి బారిన వాతావరణం వల్ల రోడ్డుపై దుమ్ము, ధూళి వస్తున్నాయి. ఈ మధ్య తాత్కాలికంగా డస్ట్ పౌడ ర్తో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆ రోడ్డు మళ్ళీ యధావిధిగా మారి డస్ట్ పౌడర్ సైతం దుమ్ము, ధూళిలో కలుస్తూ అటు వాహనదారులు, ఇటు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆ రోడ్డుపై రాకపోకలు కొనసాగించే వారు అవస్థలు పడుతున్నారు. ఇక స్థానికంగా నివసించే వారికి ఇండ్లలోకి దుమ్ము చేరుతూ వీధులన్నీ భయంగా మారి ఇంటి ముందు నిలిచి ఉన్న వాహనాలు దుమ్ముతో నిండిపోతున్నాయి. రాత్రి నిలిపిన వాహనాలు తెల్లారేసరికి నల్లగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఇండ్లల్లోకి దుమ్ము, ధూళి వస్తోంది
మా ఇండ్లల్లో నిత్యం దుమ్మూ, ధూళీ వస్తున్నా అధికారులు కనీసం చుట్టు పక్కల కవర్లు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో మాకు నిత్యం అనారోగ్య సమస్యలు వస్తున్నా యి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే నిత్యం గుంతల మయంగా ఉన్న రోడ్లతో నడవడానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు దృష్టి సారించి పనులను త్వరగా పూర్తి చేయాలి. దుమ్ము, దూళి రాకుండా ఎమైనా కవర్లు ఏర్పాటు చేయాలి.
చంద్రకళ, ఛే నెంబర్, స్థానికురాలు
వాహనాలను బయట ఆపలేని పరిస్థితి
ఇంటి ముందు వాహనాలను పార్కు చేస్తే మొత్తం దమ్ము, దూలితో నిండిపోతున్నాయి. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. పనులు జరుగుతు న్నందున ఇండ్లల్లోకి దుమ్ము రాకుండా కవర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
మల్లేశం, ఛేే నెంబర్, స్థానికుడు