Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్ పేట్
రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో ఎట్లా బతకాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని సీపీఐ(ఎం) సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు విఠల్ అన్నారు. శనివారం ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతోష్నగర్ చౌరస్తాలో ధరల పెరుగుదలకు నిరసనగా ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదలపై భారాలు మోపుతూ.. కార్పొరేట్లకు మాత్రం రాయితీలు కల్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పోతే సామాన్య ప్రజలు ఎట్లా బతకాలని ప్రశ్నించారు. ధరలను మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నియంత్రిం చడంలేదని, ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ధరల భారంతో నిత్యావసరాలు కొనలేని పరిస్థితిలో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. మరోవైపు పేదలు, కార్మికులు, కూలీలు, రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్నా వచ్చే పైసలు పెరుగుతున్న ధరలవల్ల దేనికీ సరిపోవడంలేదని, కనీసం రెండు పూటలా కడుపు నిండా బువ్వ తినడానికి కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ధరలు పెంచుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. పైగా కేంద్రం నిర్ణయాలను బలపరుస్తూ ప్రజలను విస్మరిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు, ఉన్నతవర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, ధరలను నియంత్రిం చాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు తిరగబడే రోజులు ఇంకెంతో దూరంలో లేవన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మీనా, జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్, కిషన్, కష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ నాయక్, యాకూబ్ షేక్, గులామ్ నసీర్, తదితరులు పాల్గొన్నారు.