Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పుట్టినరోజు సందర్భంగా దైవదర్శనానికి వెళ్లిన ఓ యువతి, అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న కె.భవాని గతనెల 27న తన పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లివస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పి వెళ్లింది. సాయంత్రమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె సెల్ఫోన్కు కాల్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. స్నేహితులకు, ఇరుగుపొరుగు, బంధువులకు తన ఆచూకీ కోసం అడిగి తెలుసుకున్నారు .ప్రయోజనం లేదని తెలుసుకున్న వారు చివరకు మంగళవారం తండ్రి కె. నగేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా తన కూతురు పుట్టినరోజు నాడు పరమేశ్వర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లిందని, రెండ్రోజుల తర్వాత తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్కు చెందిన కె. రాముకు ప్రసన్నతో 2013లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఆర్మీలో పనిచేసే రాము భార్యాపిల్లలను సమీపంలో ఉంటున్న ప్రసన్న తల్లి ఇంట్లోనే వదిలేసి విధులకి వెళ్లాడు. కాగా సెప్టెంబర్ 24న సెలవులో ఇంటికి వచ్చిన రాము తన భార్య ప్రవర్తనలో మార్పును గుర్తించాడు. ఈవిషయాన్ని ప్రసన్న తల్లికి చెప్పగా ఆమె కూడా కూతురుకి ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికింది. ఇదిలా ఉండగా గత నెల 31న రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ప్రసన్న ఇంట్లోంచి వెళ్లిపోయింది. అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో భర్త రాము సోమవారం రాత్రి బంజారాహిల్స్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనట్టుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.