Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో.అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వ్యవహారాలతో పారిశుధ్యం పడకేసింది. ఏ దారిలో చూసినా చెత్త కుప్పలు, ఏ రోడ్డులో వెళ్లినా దుర్వాసనే వెదజల్లుతుంది. రోడ్డు పొడవునా వ్యర్థాలు వాటిపై ముసురుతోన్న ఈగలు, దోమలు, వీధి శునకాలు, మూగజీవాల వ్యర్థాలు భారీగా దర్శనమిస్తున్నాయి. చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామంటూ జీహెచ్ఎంసీ తీసుకున్న హడావుడి నిర్ణయమే అందుకు ఏకైక కారణం. ఎలాంటి కసరత్తు, చర్యలు తీసుకోకుండా అధికారులు రాత్రికి రాత్రి నగరవ్యాప్తంగా ఉన్న అన్ని చెత్తడబ్బాలను తొలగించడంతో గ్రేటర్వ్యాప్తంగా రహదారులపై వ్యర్థాలు వరదలా పారుతున్నాయి.
డంపింగ్ నిలయాలుగా ప్రధాన రోడ్లు
పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్పోస్టు వెళ్లే రహదారిలోని ప్రభుత్వ స్థలంలో వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. షేక్పేట తహసీల్దార్ ఆఫీస్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు ఓపెన్ నాలా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎన్బీటీ నగర్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలోని వివిధ బస్తీలోని ప్రధాన రహదారులు, మున్సిపల్ పార్కులు వ్యర్థాలకు డంపింగ్ నిలయాలుగా మారాయి.
ముణ్నాళ్ల ముచ్చట్లే..
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలురకాల పథకాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా నగరంలోని ప్రజలందరికీ ఉచితంగా చెత్త డబ్బాలను అందించారు. తడి, పొడి వ్యర్థాలు ఇంటింటికి వెళ్లి సేకరిస్తే రోడ్డుపై వ్యర్థాలు వేసే అవసరం ఉండదనుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయకూడదు, అలాచేస్తే జరినామాలు విధిస్తామని ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కానీ అవన్నీ ముణ్నాళ్ల
ముచ్చట్లాగానే మిగిలిపోయాయి. వాహనాలు, సిబ్బంది ఉండరు. సూపర్వైజర్లు ఎక్కడో ఒకచోట కూర్చొని ఫోన్లో అయినా ఎవరితోనైనా మాట్లాడుతూ కాలక్షేపం చేయడం తప్ప సిబ్బంది పట్ల ఏ ఒక్కరికీ చిత్తశుద్ధి ఉండట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ సంగతి..
ఇంటింటి చెత్త సేకరణ రోజూ జరగదు. మూడు రోజులు, వారం రోజులకోసారి స్వచ్ఛ ఆటోలు వెళ్లి చెత్త సేకరిస్తాయి. ఆలోపు ఇళ్లలోని చెత్త నుంచి దుర్వాసన మొదలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటో కార్మికులు నెలవారీ రుసుమును రూ.150 నుంచి రూ.200కు పెంచారు. కొన్ని అపార్ట్మెంట్లలో ఆటో కార్మికులు పైఅంతస్తులకు వెళ్లట్లేదు. చిరువ్యాపారులు, చిన్నపాటి హోటళ్ల నుంచి ఎక్కువ రుసుము డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పలు సమస్యలను స్థానికులు ఎప్పటికప్పుడు అధికారుల దష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించట్లేదు.
చెత్త నిల్వ కేంద్రాలుగా ప్రధాన చెరువులు, నాలాలు..
నిబంధనల ప్రకారం ఇంటి నుంచి సేకరించిన చెత్తను ఆటోల ద్వారా ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాలి. కానీ ఆటో కార్మికులు అత్తాపూర్ వంతెన నుంచి బాపూఘాట్ వరకు ఉన్న మూసీ నది వెంట రోడ్డు పక్కన పడేస్తున్నారు. దీంతో మూసీతీరంలో కంపు పెరుగుతోంది. దీనిపై జడ్సీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. అక్కడ కనీసం కంచె కూడా లేదు. బల్దియా పారిశుధ్యాన్ని ప్రయివేట్ ఏజెన్సీలకు ఇచ్చి ప్రతినెలా రూ.కోట్లు వెచ్చిస్తోంది. చెత్తకుప్పలు ఎక్కువగా ఉండే కాలనీలను తమ వద్దనే ఉంచుకుని గుత్తేదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. యూసుఫ్గూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో పరిస్థితులు దిగజారిపోయాయి.
జీహెచ్ఎంసీ ఏం చేసిందంటే..
కేంద్రం చెప్పిందంటూ జీహెచ్ఎంసీ హుటాహుటిన నగరవ్యాప్తంగా ఉండే 1,200 చెత్త డబ్బాలను ఒకేరోజు తొలగించింది. దీంతో డబ్బాలు లేక రోడ్డంతా చెత్తమయమవుతోంది. ఇకనైనా ప్రభుత్వం తన తప్పును గుర్తించి ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా మూగ జీవులు ప్లాస్టిక్ వ్యర్థాలు తినకుండా వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా బాధ్యతలు తీసుకొని పకడ్బందీగా చర్యలు చేపడితే ఇటువంటివి పునరావతం కావని పలువురు రాజకీయ సామాజిక వేత్తలు ఆవేదన వెలిబుచ్చారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి పోయి వివిధ రకాల వ్యాధులకు లోని చికిత్స తీసుకోవడానికి వీలు లేకుండా భారీగా ప్రాణ నష్టం వాయు కాలుష్యం జరిగి అనేక రకాల నష్టాలు కూడా జరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.