Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం కీసర ఎంపీడీఓ కార్యాలయంలో నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వం తరపున మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 118 మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకుని ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా రూ.లక్షా 116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకుని ఆడపిల్ల పెండ్లి చేసే వరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మెన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా, మున్సిపల్ చైర్మెన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, ప్రణీతగౌడ్, వైస్ చైర్మెన్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.