Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ అంటేనే చదువులమ్మ ఒడి.. ఉద్యమాల బడి.. విద్యా విధానాన్ని ప్రభావితం చేసే ఆలోచనలిక్కడే వికసిస్తుంటాయి. నూతన ఒరవడులిక్కడి నుంచే ఉద్భవిస్తుంటాయి. ఈ ఏడాది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఫలితాల్లోనూ అదే జరిగింది. అత్యధిక మంది స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధించగా అందరికంటే ముందంజలో అమ్మాయిలు నిలిచారు. 2019 నుంచి 2021 వరకు వెలుడుతున్న పీజీ ఫలితాల్లో వరుసగా అమ్మాయిలే టాప్లో నిలిచారు. ఈసారి అత్యధిక మంది అమ్మాయిలే చేరే అవకాశం ఉన్నందున లేడీస్ హాస్టల్స్ పెంపుదల, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్యలు తీసుకోవాలని వీసీ ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఓయూ ఇటీవల ఏడు వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మూడో సారి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ను నిర్వహించడం, ఫలితాలు వెలువడటం తెలిసిందే. ఫలితాల్లో సుమారు 70శాతం విభాగాల్లో అమ్మాయిలు టాప్లో నిలిచారు. అంతే కాదు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు కూడా వారివే. అన్ని వర్సిటీల్లోనూ అమ్మాయిలు ముందంజలో ఉన్నప్పటికీ ఓయూలో అత్యధిక మంది టాప్ పొజిషన్లో నిలిచారు. 1,2,3,4 ర్యాంకులు ఓయూకే దక్కాయి. ఆర్ట్స్లో కొంత వెనుకంజ కనింపించింది. ఇంజినీరింగ్, బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి కోర్సుల్లో మాత్రం అమ్మాయిలు సత్తా చాటారు. 2019లో ఇక్కడ 30150 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా 28,803 మంది అర్హత సాధించారు. 47,874 మంది అమ్మాయిలు పీజీ ఎంట్రన్స్ రాయగా 46,004 మంది అర్హత సాధించారు. అదే 2020లో 26,908లో అబ్బాయిలు పీజీ ఎంట్రన్స్ రాయగా 26,035 మంది అర్హతలు సాధించారు. అదే 45,554 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా 44,101 మంది అర్హతలు సాధించారు. ఇక 2021లో గమనిస్తే 24,229 మంది అబ్బాయిలు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయగా 22,614 మంది ఫలితాల్లో అర్హతలు సాధించారు. అమ్మాయిలు 44,604 మంది ఎంట్రన్స్ రాయగా ఫలితాల్లో 41,131 అర్హతలు సాధించి టాప్లో నిలిచారు. 2019 నుంచి 2021 వరకు ఓయూ పీజీ ఫలితాల్లో అమ్మాయిలే సత్తా చాటారు.
ప్రత్యామ్నాయం.. ప్రోత్సాహమేది?
సీపీజీఈటీ - 2021 ఎంట్రన్స్ కోసం ఎక్కువమంది అమ్మాయిలే దరఖాస్తులు చేసుకోవడంతో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ అందుకు తగిన హాస్టల్స్ సౌకర్యంపై కూడా దృష్టి పెట్టారు. దరఖాస్తులను బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న లేడీస్ హాస్టల్స్ సరిపోవనే అంచనాకు వచ్చి ప్రత్యామ్నాయం చూడాలని ప్రిన్సిపాల్స్, చీఫ్ వార్డెన్, లేడీస్ హాస్టల్ డెరైక్టర్ను ఇటీవల ఆదేశించారు. ఆన్లైన్ పీజీ కౌన్సెలింగ్ తర్వాత అమ్మాయిలు హాస్టల్స్కు వచ్చే సమయాని కల్లా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గలే ఏమిటి అనేవి వేచి చూడాల్సిందే. ఎంట్రన్స్ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు చదువుల్లో ప్రతిభ కనబర్చి ఓయూ ప్రతిష్టను మరింత పెంచుతారని ఓయూ అధికారులు, ప్రొఫెసర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ చదువుల్లో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షిస్తున్నారు.