Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్లు పెంచాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిజాం కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి హరికృష్ణ, కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నగరానికి వస్తుంటారన్నారు. కళాశాలలో అడ్మిషన్ లభించినా విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేక వేల రూపాయలు వెచ్చించి ప్రయివేట్ హాస్టల్, రూమ్ లలో ఉండలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈవిషయంలో స్పందించి హాస్టళ్ల సంఖ్య పెంచి అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికీ హాస్టల్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చైతన్య, జాయింట్ సెక్రటరీ రఘు, నాయకులు శివసాయి, వంశీ, గణేష్, నగేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.