Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
యువత, నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు కృష్ణ నాయక్ అన్నారు. డీవైఎఫ్ఐ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ 41వ ఆవిర్భావ వేడుకలను జంగంమ్మెట్ డివిజన్ ఫలక్నుమా రైల్వే స్టేషన్ రోడ్డు సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై డీవైఎఫ్ఐ మాజీ నాయకులు కిషన్, రాంకుమార్ లతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఉద్యోగుల నోటిఫికేషన్ సమస్యలపై నిరంతరం పోరాటం తప్పదన్నారు. పంజాబ్ లుథియానా పట్టణంలో డీవైఎఫ్ఐ ఆవిర్భవించిందని, ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సభ్యత్వం కలిగిన యువజన సంఘం తమదే అని అన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామన్నారు. దేశంలో 2 కోట్ల యువతకు ఉపాధి, ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఏడేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. నిత్యావసర, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 20 వేల పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తోందన్నారు. ప్రజల, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు శ్రీను, గోపాల్, రాజు, శినా, రాము, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.