Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సిటీ పోలీస్ కమిషనరేట్లో జాయింట్ సీపీ రమేష్రెడ్డి, అడిషనల్ డీసీపీ కె. మురళీధర్తో కలిసి సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఎండీ రఫీక్ ఇబ్రహీం కల్బుర్గి అలియాజ్ రెడ్డి వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల వ్యాపారం చేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన బిగ్ని శ్రీనివాస్ అలియాస్ ముఖేష్ జగిత్యాల్లో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వెస్ట్గోదావరికి చెందిన రెడ్డి పాండురంగారావు అలియాస్ గోపాల్రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంచిర్యాల్కు చెందిన ఎం.అవినాష్ కుమార్ ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. డబ్బులు సంపాదించడానికి వీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పరిచయం కావడం, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పడంతో పూర్తిగా నమ్మారు. లక్షల్లో డబ్బులు చెల్లించి మోసపోయారు. వేర్వేరుగా మోసపోయిన వీరు మరో ఇద్దరు బాధితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. పథకం ప్రకారం విజయవాడలో రెండు వైపులా ఒకేలా కనిపించే విధంగా ఒక సూట్కేస్ను తయారు చేయించారు. ఆ తర్వాత ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లతోపాటు వివిధ మార్గాల్లో అమాయకులను టార్గెట్ చేసేవారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నమ్మించేవారు. నమ్మకం కోసం బాధితుల ఇంటికే వచ్చి చిన్న బంగారు కడ్డీని చూపించేవారు. అది పరిశీలించిన బాధితులు లక్షల్లో డబ్బులు జమచేసుకునేవారు. ఆ డబ్బులను నిందితులు తీసుకుని సూట్కేస్లో పెట్టుకునేవారు. ఆ తర్వాత దృష్టి మళ్లించి తాళం చెవి తేలేదని, తిరిగి తీసుకొస్తామని నమ్మించేవారు. తాము తాళం చెవి తీసుకొచ్చేవరకు బ్యాగ్ను తమవద్దే ఉంచుకోవాలంటూ సూట్కేస్లో ఉంచిన మరో బ్యాగ్ను బాధితులకు అప్పగించి, మళ్లీవస్తాం అప్పటి వరకు ఈ బ్యాగ్ తెరవవద్దంటూ అక్కడి నుంచి జారుకునే వారు. తీరా బాధితులు తెరిచి చూస్తే అందులో పిల్లలు ఆడుకునే నఖిలీ కర్సెన్సీ ఉంటుందని సీపీ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల ఆచూకీ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో గాలించామని సీపీ తెలిపారు. ఈ ముఠా చేతిలో దాదాపు 50 మందికిపైగా బాధితులు మోసపోయినట్టు తెలిసిందని, అయితే కొందరు బాధితులు పరువుపోతుందని ముందుకువచ్చి ఫిర్యాదు చేయడం లేదని అభిప్రాయపడ్డారు. పరారీలోవున్న నేరస్తుల కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. చాకచక్యంగా నిందితులను అరెస్టు చేయడంతో కాచిగూడ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందంచారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ ఎస్హెచ్ఓ ఎండీ హబీబుల్లా, అదనపు ఇన్స్పెక్టర్ యాదేందర్, డీఐ సైదులు పాల్గొన్నారు.