Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజల మధ్యనే ఉంటూ వారికోసమే పని చేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీలగుండా మూసీ నదిలోకి చేరవేసే వరద నీటి కాలువల నిర్మాణం కోసం రూ. 110 కోట్లు మంజూరయ్యాయి. ఈసందర్భంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జంట మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్లు కుర్ర శివ కుమార్ గౌడ్, కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పొరేటర్లతో కలిసి జీవో కాపీని విడుదల చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత వందేండ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు బోడుప్పల్, పీర్జాదిగూడ నగరాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయని తెలిపారు. ఎగువన ఉన్న కుంటలు, చెరువుల నుంచి విడుదలైన వరద నీటితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వరద నీరు కాలనీలను ముంచెత్తకుండా నేరుగా మూసీలోకి పంపించే ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లామని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వారు వరద నీటి కాలువల నిర్మాణం కోసం రూ. 110 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవోలు జారీ చేసినట్లు ఆయనవెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్లు రామకృష్ణారావు, బోనగిరి శ్రీనివాస్, డీఈలు కుర్మయ్య, శ్రీనివాస్, జంట మున్సిపల్ కార్పొరేషన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.