Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో నిషేధిత టపాసులను కాల్చితే కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రీన్ టపాసులను కాల్చాలని బల్దియా సూచించింది. కానీ మార్కెట్లో టపాసులను ఎవరు తనిఖీలు చేస్తున్నారు? గ్రీన్ టపాసులని ఎలా నిర్ధారించాలి? కాలుష్యం లేని టపాసులను కొనాలంటే ఎలా? అంటూ నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితమైన జీహెచ్ఎంసీ కనీసం చర్యలు చేపట్టడంలేదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దీపావళి పండుగను గ్రేటర్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నుంచే టపాసుల మోత వినిపిస్తోంది. దీంతోపాటు దీపావళికి ముందు, తర్వాత కాలుష్యం తీవ్రత చూస్తే గ్రీన్ టపాసులను కాల్చారా? లేదా? అనేది స్పష్టమవుతుంది. గ్రేటర్లోని ఉప్పల్, రామంతాపూర్, సనత్నగర్, జీడిమెట్ల, కాటేదాన్, చర్లపల్లి, నాచారం, కుషాయిగుడ, బాలానగర్ పారిశ్రామిక వాడల్లో టపాసుల గోదాములు ఉన్నాయి. వీటితోపాటు గ్రేటర్లోని దిల్సుఖ్నగర్, మలక్పేట్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కాప్రా, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, చార్మినార్, చాంద్రాయన్గుట్ట, అంబర్పేట్ ప్రాంతాల్లో హోల్సేల్ దుకాణాల ద్వారా పెద్ద మొత్తంలో టపాసులను విక్రయిస్తున్నారు.
కమిటీలేవి?
గ్రేటర్లోని 30సర్కిళ్ల పరిధిలో టపాసులను తనిఖీ చేయడానికి, గ్రీన్ టపాసులను గుర్తించడానికి సర్కిల్ స్థాయిలోనే అధికారులతో కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ సర్కిల్లోనూ పర్యవేక్షణ కమిటీ వేయలేదని, నామమాత్రంగానే సర్క్యూలర్ జారీచేసినట్టు అధికారులు చెబుతున్నారు. అత్యధిక కాలుష్యం వెదజల్లే టపాసులను కాల్చితే సంబంధిత పోలీసు స్టేషన్ పరిధిలోనే కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. దీపావళి ప్రారంభమైన ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవని, అసలు జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీల్లేవని నగరవాసులు మండిపడుతున్నారు.