Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమకారులు, రైతు నాయకులు, ప్రశ్నించే గొంతుకలు, ఆదివాసీలు, గిరిజనులు, పోడు భూములపై పోరాడుతున్న ప్రజలపై పెట్టిన పీడీ యాక్ట్(నిర్బంధ చట్టం)లను వెంటనే ఎత్తివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ సత్యనారాయణరెడ్డి భవన్లో సీపీఐ(ఎంఎల్) రాంచంద్రన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటన అధికార ప్రతినిధి షేక్ షావలి, రాష్ట్ర నాయకులు ఎన్.చిట్టిబాబు, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి రాష్ట్ర కన్వీనర్ వెలుగు వనిత, పీడీఎస్యూ డి.మధు, నగేష్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకురాలు బోయిన మమత హాజరై మాట్లాడుతూ ప్రజా సంఘాల నాయకులపై తెలంగాణ ప్రభుత్వం కక్ష భూని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వరవరరావు, సాయిబాబా లాంటి వారిని అకారణంగా నిర్బంధించి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతియుత, రాజకీయ, రాజ్యాంగ పరిరక్షణకు పాటు పడాలని హితవు పలికారు. ప్రాథమిక హక్కులకు భంగకరమైన ఫాసిస్టు నిర్బంధ దమనకాండ చర్యలను వెంటనే ఆపి నల్ల చట్టాలను ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.