Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో పాటు వాటి ఖర్చులు, చేపట్టిన అభివృద్ధి పనులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు. ఈసందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో కార్పొరేషన్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరద ముంపు సమయంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో వరద సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పనులను ప్రారంభించలేదన్నారు. పాలకవర్గానికి వార్షికోత్సవాల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లను మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతిస్తున్నామన్నారు. జంట కార్పొరేషన్లలో సమస్యను పరిష్కరించేందుకు వెంటనే పనులను ప్రారంభించి, త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.