Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ అన్నారు. వెంటనే పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని సోమవారం హైదరాబాద్, మేడ్చల్ కలెక్టరేట్ల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున్న పాల్గొని ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యారంగ సమస్యలు పెరిగాయనీ, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంద న్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విద్యార్థుల భవిష్యత్పై, ఉపకార వేతనాలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తోందని విమర్శించారు. అరకొరగా విడుదలైన స్కాలర్షిపులు,ఈ రీయింబర్స్మెంట్ కేవలం మంత్రుల కళాశాలకు మాత్రమే విడుదల అవుతున్నాయన్నారు. మేడ్చల్ జిల్లాలో అనేక పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు కోసమే పని చేస్తున్నట్టు వ్యవహరిస్తుందన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలో కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. గురుకులాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, పౌష్టికాహార చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనీ, లేకపోతే అసెంబ్లీ, ప్రగతిభవన్, సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహ్మరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సాయి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు కాశి, నాయకులు హారతి, కిరణ్, విక్రమ్, దయాకర్, సాకేత్, తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలనీ, విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశోక్రెడ్డి, జావిద్, నాయకులు సునిల్, శ్రీమన్, వేణు, అజరులతో పాటు పెద్దఎత్తున్న విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.3,800 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే సందర్భంలో ముందస్తు ఫీజులు కడితేనే యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇస్తామని బెదిరిస్తున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పించి.. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచి పౌష్టికాహార భోజనం అదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, యూనివర్సిటీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలనీ, జీవో 46, 41 అమలయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు చూసుకోవాలని కోరారు. బీ కేటగిరీ సీట్లన్నీ రూ.లక్షకు అమ్ముతూ డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజును వసూలు చేస్తున్న ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల హాస్టల్కు సొంత భవనాలు నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ కళాశాల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.