Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
మటన్, సారావృత్తి ఆరెకటికల జన్మహక్కు అని, కులవృత్తుల్లో తమకు కచ్చితంగా న్యాయం చేయాలి అని ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆరెకటికల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈదీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆరెకటిక కులానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆరెకటికలకు వైన్ షాపులో 30 శాతం రిజర్వేషన్లు, మటన్ వృత్తిదారులకు రూ.3లక్షల లోన్లు మంజూరు చేసి 80 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. దళితబంధు మాదిరిగా ఆరెకటిక బంధు ఇచ్చి ఆదుకోవాలన్నారు. రూ.500 కోట్లతో ఆరెకటిక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ రాందాస్, ఉపాధ్యక్షులు నగశేషు, వెంకటేశ్వర్లు, రమేష్, జాంగీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.