Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గం ఇతర ఏ కులానికి ప్రత్యామ్నాయం కాదన్నారు. ఎమెల్సీ నామినేటెడ్ పోస్ట్ మాదిగలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ సాధన కోసం డిసెంబర్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా 13న ఒక రోజు దీక్ష, 14న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తూ బీజేపీ దళితులను మోసం చేస్తుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీ వంతపాడటం ఆపాలని మందకృష్ణకు హితవు పలికారు. సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, మహాఎమ్మార్పీఎస్ ముత్యపాగ నర్సింగ రావు, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, దళిత దండు అధ్యక్షులు బాలరాజు, మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మైసా ఉపేందర్, మాదిగ జేఏసీ నాయకులు కిరణ్ పాల్గొన్నారు.