Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కోరింది. మంగళవారం హైదర్గూడలోని మహాసభ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్య వృత్తిపై ఆధారపడి ఉన్న ముదిరాజ్ కులస్తులు సభ్యత్వాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని, నిబంధనల ప్రకారం సభ్యత్వాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ కృషి చేయాలని కోరారు. ముదిరాజ్ మత్స్య కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.268 వల్ల గ్రామ స్థాయిల్లో వేధింపులు, దాడులు తగ్గిపోయాయన్నారు. మార్కెటింగ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటుతో ముదిరాజ్ యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ముదిరాజ్ కుల సంక్షేమం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్, సలహాదారులు పిట్టల రవీందర్, నాయకులు అల్లుడు జగన్, హరినాథ్, సత్తయ్య, బొక్కా శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.