Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
దేశంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతుందనీ, మోడీ, కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్రా చారి, కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సాగు నల్ల చట్టాల అమలులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును, వరి ధాన్యం కొనుగోలును వ్యతిరేకిస్తు న్నాయని పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవీంద్రా చారి, ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి పచ్చని పైరుతో కలకలలాడే విధంగా బంగారు తెలంగాణ నిర్మిస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్, దేశంలోనే వరి సాగు విషయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం అని ప్రగల్బాలు పలికిన దొరగారనీ, వరి పంట సాగు చేయకుండా రూ.కోట్లు కుమ్మరించి సాగునీరు ప్రాజెక్టులు ఎందుకు నిర్మిం చారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమేనా అన్నారు. వరి పంట సాగు చేయడం నేరంగా భావిస్తున్నట్టు అగ్రికల్చర్ ఆఫీసర్లతో రైతులు, వ్యవసాయదారులను భయపెట్టడం భావ్యం కాదనీ, ఎఫ్సీఐ గోదాములను పాలకుల బార్ల కోసం వాడుకుంటాకా అని ప్రశ్నించారు. ఐకేపీ కేంద్రాలను పేకాట కేంద్రంగా నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం బంధించబడి ఉందనీ, అందుకే నేడు ఏ ఒక్క పేదవాడికి, రైతుకు, కార్మికుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు లేదనీ, తినే ఆహారంలో ఉండాల్సిన స్వేచ్ఛ చివరకు పండించే వ్యవసాయ పంటలకు కూడా పాలకుల నిర్ణయాలపై ఆధారపడి రావటం ఆందోళనకరమైన విషయం అన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటే అనీ, రూపాయి నానేంకు బొమ్మ, బొరుసు మాదిరిగా నామమాత్రపు పరస్పర విమర్శలు ప్రదర్శించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిం చారు. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ సుమారు 14 మాసాలుగా వివిధ రాష్ట్రాల రైతులు, వ్యవసాయ కూలీలు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న వందలాది మంది ప్రాణాలు గాల్లో కలుస్తా ఉంటే నరేంద్ర మోడీ అచ్చే దిన్ ఆయేగా అంటూ దేశాన్ని మొత్తంగా కాన్పొరేట్ కంపెనీలకు, బడా వ్యాపారులకు అప్పనంగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఒకలా గల్లీలో ఒక లా పరిపాలన సాగిస్తున్న బీజేపీకి రైతులపైన కక్ష సాధింపుగా, కార్మికుల వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుంటున్నదన్నారు. మోడీ తెచ్చిన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేయాలనీ, పండించిన ప్రతి పంటకూ సరైన గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో బేషరత్గా కొనుగోలు చేయాలనీ, మార్కెటింగ్ విషయంలో దళారీ వ్యవస్థను రద్దు చేయాలనీ, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాసంగి వరి సాగును ప్రోత్సహించాలనీ, లేని యెడల రైతు పోరాటానికి బాసటగా ఉంటూ పండించిన ప్రతి పంటనూ అమ్ముకునే హక్కును కాపాడుకునేందుకు సీపీఐ వారికి అండగా ఉంటూ ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తోకల రాంరెడ్డి, రాష్ట్ర ప్రజా నాట్యమండలి అధ్యక్షులు పల్లె నర్సింహా, సీపీఐ మండలం సహాయ కార్యదర్శి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, జిల్లా ప్రజా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి దిగోజు వేణుగోపాల్చారి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కేతరాజు నర్సింహా, అమనగంటి వెంకన్న, దాసరి ప్రసాద్, మండలం సీపీఐ కార్యవర్గ సభ్యులు యేశాల నర్సింహా, నాగవల్లి యాదగిరి, దాది మల్ల నారాయణ, పొన్నాల యాదగిరి, నారాయణ రెడ్డి, రాములు, వట్టి నవనీత, ఎదురెపల్లి దేవమ్మ, కాటి అరుణ, కౌన్సిల్ సభ్యులు చిలుకూరి పుల్లయ్య, భిక్షపతి, పగడాల మహేందర్, బొజ్జ రాజు, అచ్చి నారాయణ, మహేష్, కుర్మయ్య, పోషాలు, రాము, తదితరులు పాల్గొన్నారు.