Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆస్టర్ హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం, ఆస్టర్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో 12 ఏండ్లలోపు ఉన్న 100 మంది నిరుపేద చిన్నారులకు అవసరమైన అన్నిరకాల శస్త్రచికిత్సలను ఒక ఏడాది కాలంలో ఉచితంగా చేయనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ సదుపాయాన్ని భారత దేశంలోని ఐదు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందిస్తామని పేర్కొంది. రెండో జీవితాన్ని ప్రసాదించాలనే పేరుతో చేపడుతున్న ఈకార్యక్రమాన్ని సోమవారం ఆస్టర్ ప్రైమ్ రీజనల్ సీఈఓ కేటీ దేవానంద్, ఆంధ్ర, తెలంగాణ రీజనల్ డైరెక్టర్ డా.నితీష్ శెట్టి, కర్నాటక, మహారాష్ట్ర క్లస్టర్ డైరెక్టర్ డా.పర్హాన్ యాసిన్, కేరళ క్లసర్ ఒమన్ లతో కలిసి ప్రారంభించారు. సర్వ సాధారణంగా చిన్నారులకు అవసరమయ్యే అపెండిసైటిస్, ఇంటసస్పెషన్, ఎంపిమా, పీడియాట్రిక్ యూరాలజీ శస్త్రచికిత్సలతో పాటూ సంక్లిష్టమైన బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ ప్లాంట్స్, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు వంటి వాటిని కూడా చేస్తామని వారు వివరించారు. ఈచికిత్సకయ్యే ఖర్చుకు సంబంధించిన నిధులను ఆస్టర్ డీఎం ఫౌండేషన్ వారితో పాటూ దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి ఆస్టర్ హాస్పిటల్స్ వారు కేరళలోని కాలికట్ లో 24 గంటలు వివిధ భాషలలో పని చేసే ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాల్ సెంటర్ను సంప్రదించాలనుకొనే వారు 0919633620660కు డయల్ చేయవచ్చు అని సూచించారు. అనంతరం ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మెన్, ఎండీ డా. ఆజాద్ మూపెన్ మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు పేదరికంలో నివసిస్తూ అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ సరైన చికిత్స అందించలేక చిన్నారుల ప్రాణాలు కాపాడలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చాలా సందర్భాల్లో అవయవ మార్పిడి చేయడం, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్స్, గుండె సంబంధిత శస్త్ర చికిత్స వంటి సంక్లిష్టమైన వాటితో పాటూ పలు సర్వసాధారణమైన శస్త్ర చికిత్సలు అందించగలిగితే ఈ చిన్నారులకు రెండోసారి జీవనాన్ని ఇవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.