Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిశాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణతో ఎన్నిక ఏకగ్రీవమయింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల సంఖ్య 15. టీఆర్ఎస్ నుంచి 11 మంది, మజ్లీస్పార్టీ నుంచి ఏడుగురు నామిషన్ దాఖలు చేశారు. అయితే సోమవారం టీఆర్ఎస్ నుంచి జగదీశ్వర్గౌడ్, రాగం నాగేందర్యాదవ్, వనం సంగీత యాదవ్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఒప్పందం ప్రకారమే
ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు జీహెచ్ఎంసీ పాలకవర్గంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి పదవులను పంచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల పాటు మేయర్ పదవిలో ఉంటే మజ్లీస్పార్టీ మూడేండ్లపాటు మేయర్ పీఠం దక్కించుకుంది. ఇక స్టాండింగ్ కమిటీలో ఎనిమిది, ఏడుగా పంచుకున్నది. అదే తరహాలో 2016లో టీఆర్ఎస్ 99 వార్డులు, మజ్లిస్ 44 వార్డులు గెలవడంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయినా మజ్లిస్ పార్టీతో కలిసి పనిచేసింది. అందులో భాగంగానే స్టాండింగ్ కమిటీలో చెరిసగం పంచుకున్నాయి. ఈ సారి టీఆర్ఎస్కు 56, మజ్లిస్పార్టీ 44 వార్డులను కైవసం చేసుకోవడంతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే మెజార్టీలేదు. అయితే టీఆర్ఎస్కు మజ్లిస్పార్టీ మద్దతు ఇవ్వడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకుంది. స్టాండింగ్లో మాత్రం టీఆర్ఎస్ 8 మంది, మజ్లిస్పార్టీ ఏడుగురు సభ్యులతో సరిపెట్టుకున్నాయి. అయితే 47మంది కార్పొరేటర్లు ఉన్న బీజేపీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ముందు హడావుడి చేసింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైగా ఎన్నికలను బహిష్కరించినట్టు ప్రకటించింది.
నామినేషన్ల తీరు
స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులకుగాను 18 మంది నామినేషన్లు వేశారు. అయితే సోమవారం ముగ్గురు సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు ప్రకటించారు.