Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
సమస్యలపై ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చైర్మెన్ బోయపల్లి కొండల్రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎల్ఐజీ కాలనీ వార్డు కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన వార్డు కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్డు కమిటీ సమావేశాలను నిర్వహిస్తుందన్నారు. మూడో వార్డు పరిధిలో దాదాపు రూ.2 కోట్లా 35 లక్షల అభివృద్ధి పనులు స్థానిక కౌన్సిలర్ చింతల రాజశేఖర్ ప్రతిపాదన మేరకు చేపట్టామని వివరించారు. ఇందులో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ చింతల రాజశేఖర్ మాట్లాడుతూ పలు సమస్యలను చైర్మెన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యాంనంపేట వీకర్ సెక్షన్ కాలనీకి తక్షణమే కృష్ణా నీటిని అందించడం కోసం పైప్లైన్ పనులను ప్రారంభించాలనీ, అక్కడ మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఎల్ఐజీ కాలనీ చుట్టూ పెన్సింగ్ వేయాలనీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనీ, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో కరెంటు సమస్య అధికంగా సమస్యను పరిష్కరించేందుకు కరెంటు స్తంభాలు, మూడు వైర్లను గుంజాలని కోరారు. ఎల్ఐజీ కాలనీ అండర్ గ్రౌండ్ లో ఉన్న కరెంట్ కేబుల్ను తొలగించి పై నుంచి ఇవ్వాలని కోరారు. అనంతరం సమస్యల వినతిపత్రాన్ని చైర్మన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, ఏఈ నరేష్ కుమార్, జలమండలి అధికారి అనిల్, వార్డు ఆఫీసర్ వెంకటేష్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రాఘవేందర్, ఎల్ ఐ జీకాలనీ మాజీ ప్రెసిడెంట్ మన్మధరావు, కాలనీ సొసైటీ నాయకులు పురుషోత్తంరెడ్డి, కృష్ణ, సురేష్, బ్లాక్ ఇన్చార్జిలు ఆంజనేయులు, మోబిన్ సుల్తానా, మౌనిక, రత్నాకర్, నిరంజన్, దేవిక, తదితరులు పాల్గొన్నారు.